అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన శ్రీకర్ భరత్

  • భారత్ తరఫున ఏడు టెస్టు మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం
  • దేశం కోసం ఆడటం గొప్ప గౌరవమని భావోద్వేగ పోస్ట్
  • విశాఖపట్నానికి చెందిన 32 ఏళ్ల భరత్ ఈ నిర్ణయం
  • రంజీల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్‌గా రికార్డు
టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్, ఆంధ్రప్రదేశ్ క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ (కేఎస్ భరత్) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 32 ఏళ్ల భరత్, గురువారం సోషల్ మీడియా వేదికగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు.

"దేశం తరఫున ఆడటం నా జీవితంలో దక్కిన అతిపెద్ద గౌరవం. ఎంతో గర్వంగా, కృతజ్ఞతాభావంతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నాను" అని భరత్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. గత 20 ఏళ్లుగా తన కలను నిజం చేసేందుకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా భరత్ ధన్యవాదాలు తెలిపాడు.

రిషభ్ పంత్ గాయపడటంతో 2023 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన నాగ్‌పూర్ టెస్టులో భరత్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో మొత్తం ఏడు టెస్టులు ఆడిన ఈ ఆంధ్రా ఆటగాడు... 20.09 సగటుతో 221 పరుగులు చేశాడు. ఇందులో 44 పరుగులే అత్యధిక స్కోరు. 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోనూ ఆడాడు. 2024 ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో తన సొంతగడ్డ విశాఖపట్నంలోనే చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు.

ఐపీఎల్ ప్రయాణాన్ని పరిశీలిస్తే.. 2015 వేలంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ భరత్‌ను రూ.10 లక్షలకు దక్కించుకుంది. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

విశాఖపట్నంలో జన్మించిన భరత్, దేశవాళీ క్రికెట్‌లో ఆంధ్ర జట్టు తరఫున కీలక ఆటగాడిగా ఎదిగాడు. 2015లో రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. 2005లో ధోనీ 148 పరుగులు చేసిన విశాఖ వన్డేలో భరత్ బాల్ బాయ్‌గా వ్యవహరించడం ఒక మధుర జ్ఞాపకం. జాతీయ జట్టులో స్థానం కోసం తీవ్రమైన పోటీ నెలకొనడంతో భరత్‌కు పరిమిత అవకాశాలే లభించాయి.

KS Bharat
Srikar Bharat
Indian Cricket
International Retirement
Andhra Pradesh Cricket
Test Cricket

More Telugu News